ఒకరోజు వంటకోసం ఆకుకూరలను కట్ చేసేటప్పుడు, ఆకంతా పురుగుపట్టి నల్లగా కనిపించింది. శుచీ శుభ్రత లేని కూరగాయలు, కల్తీ తిండి అంత మంచిది కాదని భావించారు. దీనికి పరిష్కారం ‘నేచురల్ అగ్రికల్చర్’ అనుకున్నారామె. గతంలో వ్యవసాయం చేసిన అనుభవం ఉంది. ‘‘ఒకవైపు మంజీరా నది, మరోవైపు సాగుకు అనుకూలమైన భూమి దొరకడంతో సంగారెడ్డిలోనే వ్యవసాయం చేయాలనుకున్నాం. భూమిని సారవంతం చేసేందుకు వేప, ఆముదం పిండి వేసి సాగులోకి తెచ్చాం. జీలుగ, పచ్చిరొట్టలను కూడా వాడాం. దశగవ్య (పాలు, పెరుగు, నెయ్యి, అరటిపండు మొదలైనవి) నేచురల్ ఎరువును చల్లాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయ భూమిని సారవంతం చేశాం. ఎక్కువ దిగుబడులు సాధించాం” అని చెప్పారామె.
చరక పేరుతో..
దేశీయ పశు సంపద ఆర్గానిక్ సాగుకు వెన్నెముక లాంటిది. దేశీయ ఆవుల మూత్రం, పేడ వ్యవసాయ భూములను సారవంతం చేస్తుంది. అందుకే లావణ్యారెడ్డి డెయిరీ ఫామ్ను విడిచిపెట్టినా..దేశీ ఆవులను సాకడం మానలేదు. అందోల్లో వాటికోసం ప్రత్యేకంగా ఒక షెడ్డు కట్టించారు. వాటి పోషణను స్వయంగా చూసుకుంటారు. వాటి నుంచే వచ్చే ఉత్పత్తులు కూడా పొలానికే వాడతారు. ఎన్నో రకాల కూరగాయలు, ఆకుకూరలు, వరి పండిస్తున్న లావణ్యారెడ్డి వాటితో సొమ్ము చేసుకోవడానికి ఇష్టపడరు. ఆర్గానిక్ పంటలు పండిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో రైతులకు వివరించి చెప్తున్నారు. అలా ఆర్గానిక్ పద్ధతులను ఇతరులకు పరిచయం చేస్తున్నారు. ఫామ్లో పండే కూరగాయలు ఉచితంగా పంచి పెడతారు. పాలు, పెరుగు, నెయ్యి, బియ్యం లాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రం ‘చరక అమృత్’ పేరుతో అమ్ముతున్నారు. ఆమె కృషికిగాను ‘చెన్నై గ్లోబల్ హ్యూమన్ పీస్’ వాళ్లు ఈ మధ్యనే‘అగ్రికల్చర్ డాక్టరేట్’ ఇచ్చి సత్కరించారు. ముందు
ముందు ఆ ఫామ్ను తెలంగాణలోనే ఒక మోడల్ ఫామ్గా మార్చి, ప్రతి రైతునూ ఆర్గానిక్ ఫార్మర్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమంటున్నారు లావణ్యారెడ్డి.